Sunday, December 23, 2012

కృష్ణం వందే జగద్గురుం - చలిస్తున్న చలం కొండలు



                                       వసుదేవ  సుతం దేవం - కంస చాణూర మర్ధనం!
                                       దేవకి పరమానందం -కృష్ణం వందే జగద్గురుం!!

     ఎవడి బతుకు వాడు బతకాలి. పక్కవాడు ఎటుపోతే మనకేమి! వాడికి ఏమైతే నాకేమి! అనే ధోరణిలో వెళ్తున్న సగటు మనిషి చెంప చెళ్ళు మనిపించి, చెవి మెలిపెట్టి ఆలోచనను సరైన ధోరణిలో  పెట్టే ప్రయత్నంలా ఉంది ఈ సినిమా.

     రెక్కలు వచ్చిన పక్షి ఎగరాలి అది ప్రకృతి  ధర్మం. పక్షిని ఎగరనివ్వాలి. మీరెళ్ళి  పట్నంలో బతక లేరు. వీళ్లు  ఇక్కడ ఉండలేరు- అని హీరో పట్నం వెళ్తామన్న యువకుల ప్రయత్నానికి  అడ్డుపడుతున్న పెద్దవారితో నచ్చ చెప్పే ప్రయత్నం చేసే సందర్భం కూడా వాస్తవం ఈ రోజు ప్రతి గ్రామంలో కనిపిస్తున్న దృశ్యం కూడా ఇదే.నిజమే తప్పదు. నమ్ముకున్న వ్యవసాయం, కులవృత్తులు మనిషిని బతికించ  లేనప్పుడు అంతకన్నా దారి  ఏముంది?

     అన్నం లేదని మట్టిని అడిగితే, మట్టి అన్నం పెడుతుంది. అసలు మట్టే లేకపోతే ఎవరిని అడుగుతాం? అని పిచ్చోడిలాగా మాట్లాడినా మనసున్న ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసే మాట. నిజమే! మనిషికీ మట్టికీ ఉన్న బంధం అలాంటిది . తల్లీ బిడ్డకూ  ఉండే బంధం కన్నా గాఢమైన బంధం ఇది. ఈ రోజు ప్రతీది వ్యాపార ధోరణిలో చూస్తున్న మనకు అంతగా అనిపించకపోవచ్చు కానీ, 15 సం . ముందు పల్లెల్లో ఎవరైనా ఒక ఎకరం కొంటే  కొంనవాడి ఇంటిలో పండుగే!పొలం అమ్ముకున్న వాడి ఇంటిలో సోక దేవత తాండవిస్తుంది.అన్నం కూడా సరిగా తినేవారు కాదు. ఎకరం దాక ఎందుకు గట్టు దగ్గర ఒక అరడుగు స్థలం విషయంలో కూడా నాదంటే నాది అని పెద్ద గొడవలు పడిన సందర్భాలు అనేకం. ఈ మధ్య వచ్చిన కందిరీగ సినిమాలో ఒక అడుగు స్థలం కోసం ఆస్తులు అమ్ముకున్న కామెడి విలన్ ని చూపించారు కదా! అది కూడా వాడికి మట్టి మీద మమకారం , మాట పట్టింపు అన్న కోణంలోనే చూడాలి. నిజమే!  మట్టి మీద  ప్రేమ అలాంటిది.

     బళ్ళారి లోనే మైనింగ్ (విధ్వంసం) జరుగుతుందా? సందర్భం కొరకు అలా  చూపించారు కానీ, ఎక్కడ లేదు చెప్పండి. బయ్యారం లో లేదా?సిమెంట్ ఫ్యాక్టరీ ల కొరకు అవసరానికి మించి పొలాలను లాక్కోవటం పల్నాడు లో లేదా? బాక్సైట్ తవ్వకాల కొరకు అని ఉత్తరాంధ్ర లో లేదా?శ్రీకాకుళం  జిల్లా కన్నెధార కొండల్లో లేదా?మన గ్రామంలో లేదా? ఈ మైనాసురులకు భయం లేదు. అధికారులను కొంటారు, లేదా భయపెడతారు. ఎవడైనా సరే భయ పడతాడు . భయం చాల చెడ్డది కదా! ఎవడి కోసమో నేనెందుకు రిస్క్ తీసుకోవాలి?స్పందించ వలసిన వాడు స్పందించకుండా, నేనొక్కడినే అడ్డుతగిలి, నా  కుటుంబాన్ని కెరీర్ ను ఎందుకు రిస్క్ లో పెట్టుకోవాలి? పెద్దలందరూ తల వంచుకుంటున్నప్పుడు  నేనెంత ? అని అలోచించి ప్రతివాడు తల వంచుకు వెళ్తున్నాడు. విధ్వంసం జరుగుతూనే ఉంటుంది.కన్నె ధార  కొండల్లో చూడండి, దేవుడి పేరు చెప్పి మైనింగ్ కు అడ్డు తగులుతున్నారని, ఆ దేవుడినే లేకుండా చేద్దామనే ప్రయత్నం జరుగుతుంది.

      అక్కడ దాక ఎందుకు మన గ్రామంలో ఉన్న చలం కొండలనే తీసుకోండి. గ్రామానికి, చలం కొండలకు ఉన్న అనుబంధం ఎంత ఉంది! ఆ కొండలకు ఎంత చరిత్ర ఉంది! కాటంరాజు  (క్రీ.శ  12 వ శతాబ్దం) తన ఆవుల మందలు ఇక్కడే మేపాడని , మనమ సిద్దితో యుద్ధానికి వెళ్తూ ఇక్కడ వీర భద్ర స్వామి ఆలయం కట్టించారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయం ముస్లిముల దండ యాత్రలలో దెబ్బతిన్నది.అవశేషాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు చలం కొండల్లో అందమైన దేవత విగ్రహాలు వందల సంఖ్యలో ఉండేవట! మునులు, సిద్దులు చలం కొండల్లో తపస్సు చేసుకోనేవారని అంటారు.దానికి నిదర్సనం కూడా గ్రామంలో ఉంది. ఒక రైతు తెల్లవారు జామున మచ్చు గట్టు నుండి చెలం కొండలకు వెళ్ళే సిద్ద పురుషులను చూసాడట . వారు ఆ రైతును దగ్గరకు పిలిచి మమ్మల్ని చుసిన విషయం ఎవరికైనా చెబితే తలపగిలి చస్తావని చెప్పి వెళ్లారు.    వృద్ధాప్యంలో ఆ రైతు  జబ్బు తో   మంచాన పడి, తనకు అంతిమ ఘడియలు సమీపించాయని తెల్సిన తర్వాత , తన వారిని పిలిచి, తను చలం కొండల సమీపంలో సిద్ద పురుషులను చూసిన విషయం చెప్పాడు.వెంటనే అయన తల చిట్లి పోయి చనిపోయాడని చెబుతారు

     పైన చెప్పుకున్న దంతా  బుర్ర  కథ అనుకుందాం . సుమారు 15 నుండి 20 సం . క్రితం  వరకు తోలి ఏకాదశి చలం కొండలలో ఎలా ఉండేది? చిన్నా ,పెద్దా  అందరు తెల్లవారు జాము నుండే రామ బుగ్గ దగ్గరకు వెళ్లి స్నానాలు చేసి, ఆ చలంలో రూపాయి వదిలి ,దీపారాధన చేసి వచ్చేవారు. ఈ రోజుకి కూడా తోలి ఏకాదశి నాడు అందరు ఈ విషయాన్ని  గుర్తు చేసుకుంటారు.(తోలి ఏకాదశి వార్త కొరకు ఇక్కడ క్లిక్ చేయండి) .అన్ని గ్రామాల వారు తొలి ఏకాదశి అంటే కోటప్పకొండ, అమరావతి, శ్రీశైలం ఇలా వెళ్ళేవారు.కానీ అప్పట్లో గ్రామస్తులు పెద్దగా  బయటకు వెళ్ళేవారు కాదు. తోలి ఏకాదశి మరునాడు పిల్ల లందరూ చెలం కొండల మీద ఉన్న అట స్థలంలో ఆడుకొని వచ్చేవారు.

     నా మిత్రుడు ఒకరు మాట్లాడుతూ ఇలా తన ఆవేదన వ్యక్తం చేసారు-2001 సం .లో ఉద్యోగ నిమిత్తం రోజు చిలకలూరిపేట నుండి చందవరం వెళ్ళేవాడిని. వెళ్ళేటప్పుడు  బైక్ అద్దంలో రెండు కొండలు నిండుగా కనిపించేవి. తిరిగి వస్తు వాటిని చూస్తూ వెళ్తుంటే ఏదో తెలియని ధార్మిక మైన అనుభూతి. కానీ ఇప్పుడు చూస్తుంటే రాళ్ల కుప్పలు కనిపిస్తున్నాయి. అల చూడటం చాల బాధిస్తుంది - అని. గ్రామంలో ఒక యువతి ఇలా అంది. ఆమె హిందువు కూడా కాదు. ఇది వరకు పొద్దున్నే నిద్ర లేవగానే రెండు కొండలు చూసి గాని నేను ఏ పనీ  చేసే దాన్ని కాదు ( వాళ్ళ ఇంటి నుండి చలం కొండలు కనిపిస్తాయి). ఈ రోజు లేవగానే ఆ రాళ్ల కుప్పలు  చూడాలంటే బాధగా ఉంది. (ఛిద్రమవుతున చలం కొండలు నాదెండ్ల విహంగ వీక్షణం అనే పోస్టింగ్  లో కనిపిస్తాయి ఇక్కడ క్లిక్ చేయండి



     గ్రామంలో ప్రధాన రహదారి పాడయింది తిమ్మాపురం వెళ్ళాలంటే భయంకరమైన అనుభవం. ఈ రోడ్డు నే రోజు వందల మంది కంపెనీ లలో పని చేసే వర్కర్లు, కాలేజికి వెళ్ళే విద్యార్ధులు,స్కూల్ కి వెళ్ళే చిన్న పిల్లలు ఉపయోగిస్తున్నారు. చచ్చిన తరువాత నరకం ఏలే ఉంటుందో తెలియాలంటే ఈ రోడ్డు పై ప్రయాణం చేస్తే సరి. 15 టన్నుల లోడ్ వెళ్ళాల్సిన రోడ్డు మీద 80 టన్నులు లోడ్ వెళుతుంది. అధికారులకు, నాయకులకు, అందరికి ఈ విషయం తెలుసు. జనాల కూ తెలుసు! ఎవరూ  మాట్లాడరు . ఎవరికీ వారు వాళ్ళ పాపాన వాళ్ళే   పోతారు, మనకి దేనికిలే అనుకుంటున్నారు. ఒక కామన్ మాన్ మాటల్లో చెప్పాలంటే గట్టిగ మాట్లాడగలిగే వారు మాట్లాడరు . స్థాయి లేని వారు మాట్లాడినా  పట్టించుకోరు. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం. డబ్బులు కొండంత రాసి పోసినా  కొండలు మళ్లీ  తిరిగి తేలేము. ఒక్క మాటలో చెప్పాలంటే చలం కొండల చితి మంటల్లో మనం చలి కాచు కుంటున్నాము.

                    దేవుడంటే సాయం . చేప సాయం చేసిన తాబేలు సాయం చేసినా , సాయం చేసింది కాబట్టి దేవుడు అనుకుంటున్నాము- అని ఒక సందర్భంలో హీరో అంటాడు .నిజమే కావచ్చు. అందుకే మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు . సాయం  చేసిన ప్రతి వాడిని  మనం దేవుడనే అంటాం  కదా ! అందరు కూడా చేతనైనంత సాయం  చేయాలి.అప్పుడే మనిషిలో దైవత్వం కనిపిస్తుంది. ఎవరు నమ్మినా , నమ్మకున్నా ఏ పేరు పెట్టుకున్నా దేవుడున్నాడన్న మాట మాత్రం నిజం. లేకపోతే  మైనాసురుడు  గాలి జనార్ధన్ రెడ్డి అరెస్ట్ కావటం ఏమిటి? బెయిల్ స్కాం  బయట పడటం ఏమిటి?గాలి జనార్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పడు మీడియా తో ఒకే వాక్యాన్ని ఉచ్చరించేవాడు. సత్యమేవ జయతే! అని. ఆ మాటను అయన ఏ  విధం గ అర్ధం చేసుకున్నాడో తెలియదు గానీ , ఆలస్యంగానైనా  చివరకు జరిగింది మాత్రం అదే! సత్యమేవ జయతే !

1 comment:

  1. Hi

    nijanga chelamkondalni ippudu chustunte chala bada ga undi. nenu guntur velle tapppudu vatini chuse vadini ika mundu avi vundavu

    ReplyDelete