Thursday, July 22, 2010

పొలం కబుర్లు

గత నెల రోజుల నుండి వర్షాలు విస్తారంగా కురియుట చే గ్రామంలో వ్యవసాయ పనులు ఉపందుకున్నాయి. ఉహించని విధంగా వర్షాలు ఎక్కువగా ఉండుటచే రైతులు పొలాలు పైరు విత్తుటకు సిద్దం చేయలేదు. అందరు వేసవి కాలంలో పొలమంతా నాగళ్ళు తోలించారు. నేల లోతుగా తెగుటచే వర్షపు నీరు ఎక్కువ తాగి చేలు ఆరలేదు. గొర్రు తోలించటానికి ప్రయత్నం చేసినా నెమ్ము ఎక్కువగా ఉండుటచే కుదర లేదు. అందుకే ఎక్కువమంది విత్తలేక పోయారు.

కొందరు రైతులు వర్షాలకు ముందుగానే పొలం పాటు చేసుకోవటంతో (పొలాన్ని విత్తటానికి రెడీ చేయుట) విత్తనాలు విత్తగలిగారు. నెమ్ము బాగానే ఉండటంతో బాగా మొలకెత్తాయి అనుకుంటుండగా ఒక తెల్ల వారు జామున కురిసిన భారి వర్షానికి పొలమంతా మేట వేసుకోనిపోయి( వర్షానికి మట్టి కొట్టుకొని వచ్చి మందమైన పొరలా ఏర్పడుట) విత్తనాలు మొలకెత్తవని ఆందోళన చెందారు. మరల ఒక చిన్న జల్లు పడుట వలన మేట వేసిన చేలో విత్తనాలు కొంతవరకు మొలవ గలిగాయి. ఎక్కువ మేట వేసిన చేలో విత్తనాలు సరిగా మొలవ లేదు. విత్తులు నాటిన వారిలో మొలక శాతం మిశ్రమంగా ఉంది. రైతులందరూ రెండు, మూడు రోజులపాటు ఎండా కాస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. వాతావరణం అనుకూలిస్తే వారంలో వ్యవసాయ పనులు ఊపు అందుకుంటాయి.

No comments:

Post a Comment